
Volume – 1, July 2026, issue – 4,
సమర్పణ (D.O.S): 09 -06 – 2026 ఎంపిక (D.O.A): 17 – 06 – 2026 ప్రచురణ (D.O.P) : 01-07 -2026
వ్యాస సంగ్రహం:(Abstract)
ఆధునిక తెలుగు సాహిత్యం 18వ శతాబ్దం చివరి నుండి అనేక నూతనమైన ప్రక్రియల ద్వారా కాలానుగుణమైన మార్పులు వచ్చాయి. ఆంగ్ల భాష ప్రభావంతో నూతన ప్రక్రియల చైతన్యం విస్తరిల్లింది. ఒక వైపు సంఘసంస్కరణోద్యమాలు, మరొవైపు జాతీయోద్యమం ప్రభావం ఎక్కువగా ఉంది. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో ప్రజలు అనేక విధాలుగా స్వేచ్చా ఊపిరులు పీల్చుకున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక మరింత స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను భారతీయులు అనుభవించారు. రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అందులో భాగమైన లౌకిక వాదం లేక లౌకిక తత్త్వం గురించి విపులంగా వివరించారు. ఈ లౌకిక తత్త్వం గురించి తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు, రచయితలు, రచయిత్రులు చక్కగా తమ రచనలలో వివరించటం జరిగింది.
కీలక పదాలు : (Key Words)
లౌకిక పదం, లౌకిక తత్త్వం, లౌకిక వాదం, అన్నమయ్య సంకీర్తనలు, ఆధునిక కవిత్వం, ఊటూకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి సీతారామశాస్త్రి, మంగిపూడి వెంకటశర్మ కన్నెగంటి వీరభద్రాచార్యులు, గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుర్రం జాషువ మొదలైన కవుల కవితలు.
పరిచయం:
సాహిత్యం మానవుడిని సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతుంది. ప్రజానీకానికి ఆనందాన్ని, అభ్యుదయాన్ని కలిగించేందుకు సాహిత్య సృష్టి జరుగుతుంది: తెలుగు ఆది కావ్యం మహాభారతం నుండి నేటి వరకు తెలుగు సాహిత్యం విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ అభివృద్ధి చెందుతున్నట్లు స్పష్టమౌతుంది. తద్వారా సాహిత్యం సమాజానికి దర్పణమవుతుంది. సమాజం పై రాజ్యం లేక ప్రభుత్వం, రాజకీయం, ఆర్థికం, విద్య, మతం, కులం, భాష ప్రాంతం మొదలైన అంశాలన్నీ మిళితమై ఉంటాయి. అందులో భాగంగా మతం, విద్య ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఎల్లప్పుడూ ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన నిర్మాతలు రాజ్యాంగంలోని
సంబంధం ఐర్లిప్పులు చెంది.ప్రవేశికలో భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్మ, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదం చేర్చబడింది. అప్పటి నుండి లౌకిక వాదం, లౌకికతత్త్వం, లౌకిక రాజ్యం, సెక్యూలరిజం అనే పదాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. రాజ్యం అన్ని మతాల పట్ల సమదృష్టిని కలిగి ఉండటం అంటే రాజ్య విషయాలలో వివిధ మతాల విశ్వాసాలను గుర్తించి విధాన నిర్ణయాలను చేయగలగడం లౌకిక వాదం అంటారు.
భారతదేశంలో ఆధునిక కాలంలో లౌకికతత్వాన్ని ప్రచారం చేసిన వారిలో రాజారామమోహనరాయ్, రఘుపతి రత్నంనాయుడు, గాంధీజీ, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారు. ఆధునిక తెలుగు కవిత్వంలో లౌకిక వాదం ప్రతిబింబించిన విధానాలను తెలియజేయడం ఈ వ్యాస లక్ష్యం.
సాహిత్యంలో ప్రతిబింబించే లౌకిక వాదం అదర్శవంతమైందిగాను, వాస్తవంలో లౌకికవాదం రాజకీయ విలువలను సంతరించునదిగాను భావించవచ్చు. తిక్కన హరిహరాద్వైతాన్ని వ్యాప్తి చేసి శివకేశవులు సమానమనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, విశ్వశ్రేయస్సును కాంక్షించారు.
అన్నమయ్య సంకీర్తనల్లో లౌకికవాదం:
పదసంకీర్తనాచార్యుడైన అన్నమయ్య పద కవితలలో పరమత సహనాన్ని చూపించారు.
తందనాన అహి తందనాన పురె
తందనాన భళ తందనాన
బ్రహ్మ మొకటే పరబ్రహ్మమొకటె పర
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటె.
కుందవగు హీనాధికములిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా నొకటె అందరికి శ్రీహరే అంతరాత్మ,
నిండార రాజు నిద్రుంచు నిద్రయు నౌకటె
అండనే బంటు నిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే.
సంఘంలో హెచ్చు తక్కువలు లేవని అంతా ఆ పరబ్రహ్మమే అంటూ చెప్పటంలో లౌకిక స్ఫూర్తి గోచరిస్తుంది.
వేమన కవిత్వంలో లౌకిక వాదం:
శైవ, వైష్ణవ శాఖలు వేరు వేరుగా వర్ధిల్లుతున్న కాలంలో శివకేశవ అభేదంతో ఇరువురిని సమాన ప్రతిపత్తితో పూజించే వారు వేమన కాలంలో అధిక సంఖ్యాకులు ఉన్నారు.
శైవ వైష్ణవాది షత్మతంబులకెల్ల
దేవుడొక్కడనుచు తెలియలేరు యెఱుకలేక తిరుగునేమికలదు
తమకు భేదమయన తత్త్వంబు భేదము అని సమైక్యతా భేదాన్ని వ్యక్తీకరించారు.
జాతులందు నెట్టి జాతముఖ్యము చూడ
యెఱుకగలుగు మనుజుడే జాతిగలవాడు.
విశ్వదాభిరామ వినురవేమ! విశ్వజాతుల్లో మానవజాతే అతి విశిష్టమైనది అంటారు వేమన.
ఆధునిక కవిత్వంలో లౌకికవాదం:
స్వాతంత్ర్యోద్యమ కాలంలో వెలువడిన ఆధునిక తెలుగు సాహిత్యం అంతా రాజకీయ పునరుజ్జీవనోద్యమ చైతన్యం ఫలితంగా కలిగింది. విభిన్న ఉద్యమాల ప్రభావంతో సాహిత్య రూపాలు సృష్టించబడ్డాయి. ఈ ఉద్యమాలకు
అనుకూలంగా, ప్రతికూలంగా స్పందించి కవులు, రచయితలు వారి రచనలు చేశారు. ఎందరో కవులు హేతువాదంతో, మరోవైపు మానవతావాదంతో రచనలు చేయటం ఆరంభించారు. సంఘసంస్కరణ కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది అంటే దానికి కారణం లౌకికవాదం అనే భావన బలంగా ఉండటమే కారణం అని చెప్పవచ్చు. ఆధునిక కవులు తమ కవితలలో లౌకిక వాదాన్ని, లౌకిన భావనలను తెలిపిన విధానాలను పరిశీలించవచ్చు.
ఊటుకూరు సత్యనారాయణగారు ‘నీరాజనము’ అనే కావ్యములో విశ్వమానవ కళ్యాణానికై మహాత్ముడు గావించిన కఠిన తపస్సు, విశ్వశాంతికై చేసిన అమోఘమైన కృషిని ప్రశంసించారు.
‘దానవుల యందు సైతము మానవులనె
చూచువారికి అన్యంబుతోచగలదె?
ప్రీతి కల వారలకు ప్రాణభీతి గలదె?
ఆత్మ దర్శనమైన మహాత్ముడతడు.’
మహాత్మునకు శత్రువులు, మిత్రులు అందరూ సమానమేనని విశ్వజనీనమైన ప్రేమయే వారి ఊపిరిఅని పై పద్యంలో స్పష్టపరిచారు. ఏ పుణ్యపురుషుడు కుల, మత, వర్గ వ్యత్యాస భావాలు లేక సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సమైక్యంగా మనవయునని జీవితాంతం తపోదీక్ష సల్పినాడో ఆ మహానుభావున్ని రాక్షసత్వంతో కూల్చి వేశారని కవి మిక్కిలిగా వ్యధ చెందారు.
తుమ్మలపల్లి సీతారామశాస్త్రి:
తెలుగులో గాంధేయ కవిగా తుమ్మలపల్లి వారికి ప్రసిద్ధనామం కలదు. కవితలోనే కాదు ఆచరణలో కూడా నిరాడంబరత, సత్యహింసల పాలన, ఖద్దరు ధారణ, సామాజిక శ్రేయస్సుకే ప్రాధాన్యమివ్వడం మొదలైన వాటిల్లో తుమ్మలకు సాటి రాదగిన గాంధేయ కవి మరొకరు లేరు.
“పలికెడెది గాంధీ కధయట
పలికెంచెడి వారు తెలుగు ప్రజలట’ అంటూ పరమ పూజత్వాన్ని తెలిపారు.
తుమ్మలవారు రచించిన ‘ఆత్మకథ’ కావ్యం విశ్వ శ్రేయస్సుకై సంప్రదాయబద్ధంగా రచించారు. అధునిక యుగంలో సర్వమానవాళికి ఆదర్శవంతమైంది.
“ఎవని పుట్టువు మహాకవి గేయ విఖ్యాతి సంధించే హైందవ సంఘమునకు
నెవనీ రూపంబులో రవళించె సద్వితీ యంబు సనాతనం బార్హతేజ
మెవని సేవా త్యాగ సవనంబు భారత- మాతృధాస్యము దూల్చుమంత్రమయ్యె
విశ్వ మానవ కళ్యాణ విధి విధాత
యూతడే యంచు జయపెట్టె నెవనిజగతి
యట్టి గుణకంది గాంధీ మహాత్ముచరిత
అతడు సామాన్యుడెట్లు వాసి దెచ్చిన మహాత్ముండు’
రాముడు సత్యము కృష్ణుని ప్రేమ.
గౌతముని కరుణ పెనగొని
యోగి బాపూ బ్రతుకై మామక
కవిత్వాలకు సహశ్రయమయ్యెన్’ అని పేర్కొనడంలో సత్యం, ప్రేమ, కరుణ అనే మూడు ఆదర్శాలు వారిలో గాఢంగా ముడిపడ్డాయి.
మంగిపూడి వెంకటశర్మ:
వీరు ‘నిరుద్ధభారతం’ అనే కావ్యం వ్రాశారు. సనాతన హైందవ మతంలోని వర్ణవ్యవస్థ ప్రబలటం వల్లనే దేశము అరాచకము అయిందని బౌద్ధ, జైన, క్రైస్తవ, మహమ్మదీయుల మతాలలో సర్వసమానత్వం ఉండటం వల్లనే అవి విశ్వవ్యాప్తమైనాయంటారు. వెంకటశర్మగారి ‘మానవసేవ’ ఖండికలో మానవ సేవయే మాధవసేవ అనే మహాదాత్త సూక్తిని ఆవిష్కరించారు.
మానవుల సేవయే దేశ మాతృసేవ దేశ సేవయే సకల లోక సేవ కావునను దేశభక్తులు దైవభక్తు
లఖిల మానవ సేవ సేయంగవలయు. అని దేశసేవయే మానవ సేవ అని దేశభక్తులు ఆ మానవ సేవ చేసి చరితార్థులు అవ్వమని హెచ్చరిస్తున్నారు.
కన్నెగంటి వీరభద్రాచార్యులు:
వీరు ‘బాటసారి’ అనే లఘుకావ్యాన్ని వ్రాశారు. అందులో కుల, మత, వర్గ వైషమ్యాలను నిరశిస్తూ సమతాభావాన్ని ప్రబోధించారు. ప్రతి మానవునకు సమాన అవకాశాలు ఉన్నాయని జాతి, మత వ్యత్యాసాలతో సంబంధంలేవని తెలిపారు.
‘స్వమత పరమతముల నొక్కసరణి జూచి ముందు ముందు ప్రజా భీష్టముల నెఱింగి తిరుగు దగుగాక దుర్నియంతృత్వమున
దలచు నృపతికి దుర్గతుల్ తప్పవన్న’ అని సర్వ ప్రజలను కుల, మత భేదాలను ఎంచక సమతా భావంతో అదరించాలని కష్టజీవులను దీన ప్రజలను సర్వదా రక్షిస్తుండాలని లేకపోతే వారిలో ప్రజ్వరిల్లే విప్లవ భావాలు రాజ్యాన్ని దహిస్తాయని హెచ్చరించారు.
గురజాడ వేంకట అప్పారావు:
మానవతావాదుల నుండి కమ్యూనిష్టుల వరకు అందరి ఆదరాభిమానాలను చూరగొనగలగడమే అప్పారావుగారి గొప్పతనం, అభ్యుదయవాదిగా, లౌకిక వాదిగా, మానవతావాదిగా, దేశభక్తునిగా గురజాడ మనకు
-అప్పారావుగారిగా వ్వతనం. అభ్యుదయవాదగా, రి ఇక వాదగా, మానవతావాదిగా, దేశభక్తునగా గుంజాద్ మనకు కనబడతాడు. మన దేశాన్ని నేటికి కృంగదీస్తున్న అస్పృశ్యత అనే దురాచారాన్ని కులమత వ్యవస్థలను గురించి రచించిన ముత్యాలసరములు, లవణరాజుకల అనే కవితా ఖండికలలో గురజాడ స్పందన లౌకిక భావదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది.
‘మలిన దేహుల మాలలనుచు మలిన చిత్తుల కధికకులముల నెలవొసంగిన వర్ణ ధర్మ మధర్మంబే
మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ రెండె కులములు మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్’ మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అంత స్వర్గ సుఖంబులున్నవి యవని విలసిల్లున్
ఎల్లలోకము వొక్క ఇలై’ అని గురజాడ స్ఫూర్తిని స్మరించి వసుధైక కుటుంబ భావనను పెంపొందించును.
దేవులపల్లి కృష్ణశాస్త్రి:
కృష్ణశాస్త్రి లౌకికవాది. మతాతీతమైనమానవతావాది విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని బాటలు వేయాలని కోరుకుంటున్నారు.
‘సిలువ గుండె పైని నెలవంక తల పైని మనసులోన ప్రణవ మంత్ర దీప్తి మతము లేని యతని మనుగడే మతమని కనులు లేక మొరకు కనడు గాక!’ క్రైస్తవ మతానికి సిలువ, ఇస్లాము మతానికి నెలవంక, హైందవులకు ప్రణవ మంత్రం చిహ్నాలు, వాటి స్థానాలను నిర్దేశిండంలోను కవి ఆ మత సంప్రదాయాలను చక్కగా పాటించారు.
‘ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే
మతం వద్దు గితం వద్దు మారణహామం వద్దు’ అంటూ మత కలహాలను విడనాడి మానవులందరూ ఐకమత్యంతో కలిసి మెలిసి జీవించాలని ప్రబోధించారు.
‘ద్వేషమున్న చోట దేవుండు వెలయడు
మతులు గతులు తప్ప మతము లేదు
ఒక్క కంట ప్రేమ ఒక కంట సత్యమ్ము
వెలుగ, జగతి శాంతిని నిలుపవలయు అని పేర్కొన్నారు.
మానవుడు విశ్వమానవుడిగా ఎదగాలంటే యుగయుగాల అన్వేషణ సఫలమయి విశ్వమానవ యాత్రా స్థలాన్ని చేరాలని, భయ సందేహాలు మోసాలు, ద్వేషాలను పరిత్యజించి శాంతికి నిలయమైన ఆ యాత్రా స్థలాన్ని చేరుకోవాలనే తన ఆకాంక్షను వ్యక్తపరిచాడు కృష్ణశాస్త్రి.
గుర్రం జాషువ:
కులాల నుంచే అనైక్యత, అహంకారం నిర్ధయ మాత్సర్యం దారిద్య్ర్యం సోమరితనం మొదలైన దుష్ట భుజంగాలు ఉద్భవించినవి. కులతత్త్వం, అస్పృశ్యత నశించిపోవాలని సౌభ్రాతృత్వం, అభ్యుదయం, విశ్వ మానవత్వం, పరివ్యాప్తం
కావాలని జాషువ తన రచనల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచారు.
‘కుల మతాలు గీచుకున్న గీతల జొచ్చి
పంజరాన పట్టువడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వనరుడ నేను’
తెరుగు లేదు విశ్వనరుడ నేను కులమతాలకు అతీతంగా విశ్వశ్రేయస్సును ఆకాంక్షించిన మహామనిషి జాషువ. తాము విశ్వనరులమని కులమతాలకు ఎదురొడ్డి పోరాడటంలో లోకాన్ని లెక్క చేయమని చాటి చెప్పాడు.
అన్ని మతాల వారు ఆ కవితను చదివి ఆనందించగలరు. ఆస్వాదించగలరు. ప్రభావితం కాగలరు. ఈనాటి భారతీయ సమాజానికి కావలసిన మహాన్నతాధారాలెన్నో ఆయన తన కవితల్లో ప్రతిఫలింప చేశారు. లౌకిక దృక్పథం ఒకటి. విశ్వశ్రేయస్సును సమకూర్చే భావాలను సుందరంగా నిశ్చయంగా నిర్భయంగా ప్రకటించడంలో జాషువ విశిష్టతను చాటుకున్నారు.
ముగింపు:
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవులు ఎందరో ఉన్నారు. వారిలో సుప్రసిద్ధమైన కొందరిని ఎంపిక చేసుకుని వారి కవిత్వంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న లౌకిక భావనా దృక్పథాన్ని కొంత వరకు విశ్లేషించడం జరిగింది. ఏ కవైనా విశ్వశ్రేయస్సును కాంక్షించిన వాడే. ఏ మతం వారైనా కోరుకునేది కూడా విశ్వమానవ కళ్యాణాన్నే భారతీయ జీవన వ్యవస్థ ప్రధాన ధ్యేయం అదే. ఈ ఆదర్శానికి ప్రాచీన, ఆధునిక తెలుగు కవులు అందు కట్టుబడి ఉండటం విశేషం.
ఆధార గ్రంథాలు :
1. అనంతరామశాస్త్రి నేతి ఆచార్య, ఆధునిక తెలుగు సాహిత్యంపై లౌకిక విలువల ప్రభావం, విశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాద్, 1999.
2. చంద్రశేఖరరెడ్డి, రాచపాలెం: ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు; విశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాద్, 2006.
3. నాగభూషణశర్మ మొదలి ఆచార్య తెలుగు సాహిత్యం గాంధీప్రభావం;
గాంధీ సాహిత్యప్రచురణాలయం, హైదరాబాద్, 1970.
4. రంగనాధాచార్యులు. కె.కె. ఆచార్య: ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాద్, 1982,
5. రామమోహనరాయ్ కడియాల 20వ శతాబ్ది తెలుగు కవులు; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005.
6. లీలావతి పొన్నా ఆచార్య సంకీర్తనాజ్యోతి: పొన్నా పబ్లికేషన్స్, పానకం,1996.
-డా.ఆర్.శ్రీనివాసరావు
తెలుగు అధ్యాపకులు, మారిసెల్లా కళాశాల,
విజయవాడ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~